కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా డాక్డర్ YSR Telemedicine కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని సూచించారు.
YSR Telemedicine పని చేసే విధానం..
రాష్ట్రంలో డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్ అమలు కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబరు – 14410 కేటాయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ పేర్లు నమోదు చేశారు. డాక్టర్ వైఎస్సార్ టెలి మెడిసిన్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ఆరోగ్య సేవలు అందుతాయి.
YSR Telemedicine ఉద్దేశం..
- కోవిడ్–19 కేసులను గుర్తించడం
- ఐసొలేట్ చేయడం, పరీక్షించడం
- క్వారంటైన్కు పంపించడం
- ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్ ద్వారా వైద్యుల సూచనలు, సలహాలు
- మూడంచెలుగా ‘డాక్టర్ వైయస్సార్ టెలి మెడిసిన్’ సేవలు
స్టెప్–1
- 14410 టోల్ ఫ్రీ నెంబరుకు రోగులు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. అక్కడి సిస్టమ్ ఆ మొబైల్ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.
- ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రోగికి కాల్ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు.
- రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు.
స్టెప్–2
- రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్ వ్యవస్థకు కనెక్ట్ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి.
- ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్ను స్వీకరించి, కాల్చేసి ఓపీ సేవలు అందిస్తారు.
- ఆ రోగికి నిర్వహించాల్సిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.
- వ్యాధి లక్షణాలను బట్టి కోవిడ్–19 అనుమానిత రోగులను గుర్తిస్తారు.
- ఆ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా చికిత్స వివరాలు రోగికి అందుతాయి.
- అవసరమైన సందర్భాల్లో వీడియో కన్సల్టేషన్ కూడా ఉంటుంది.
- అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి. ఎక్కడకు పంపించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు.
స్టెప్–3
- కోవిడ్–19 అనుమానిత కేసుల జాబితాల రూపకల్పన.
- ఆ రోగులకు అవసరమైన పరీక్షలు, క్వారంటైన్, ఐసొలేషన్తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు.
- ఈ జాబితాలను జిల్లా అధాకారులకు పంపిస్తారు. తీసుకోవాల్సిన చర్యలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు.
వైద్యాధికారి –పీహెచ్సీ
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారులకు ప్రిస్కిప్షన్లు పంపిస్తారు.
- ప్రతి ఒక్క రోగికి అవసరమైన ఔషధాలను ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు, గ్రామ వార్డు వలంటీర్ల ద్వారా రోగులకు నేరుగా ఇంటికే పంపిస్తారు.
- నాన్ కోవిడ్ రోగులకు కూడా మందులు అందించే కార్యక్రమం కొనసాగుతుంది.