కరోనా రాకూడదని.. పాలలో నల్ల ఉప్పు కలిపి తాగి.. యువకుడు మృతి..!

కరోనా వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయిపోయారు.. ఇది తాగితే కరోనా రాదు.. ఇది తింటే కరోనా రాదు.. అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.. అంతే కాదు కరోనా రాకుండ ఉండేందుకు నాటు మందులను వాడుతున్నారు.. తాజాగా ఓ యువకుడు కరోనా రాకుండ ఉండేందుకు చిట్కా పాటించి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంలో మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని మచ్చబొల్లారంలో చోటుచేసుకుంది. 

చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్(30) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. సురేష్, ఆయన భార్య సంధ్య, తల్లి లక్ష్మీ కరోనా రాకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ కుటుంబానికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. పాలలో నల్ల ఉప్పు కలిపి తాగితే కరోనా రాదని సూచించాడు.

దీంతో ఈనెల 9న సురేశ్ తో పాటు భార్య, తల్లి ముగ్గురు పాలలో నల్ల ఉప్పు కలుపుకుని తాగారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వాంతులు చేసుకున్నారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.   

 

Leave a Comment