చేవెళ్లలో ‘దిశ’ తరహా ఘటన

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో దిశ ఘటన తరహాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఆతర్వాత హత్యచేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం తంగడపల్లి శివారులోని వంతెన కింద గుర్తు తెలియని మహిళ(30) మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిల శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో ..అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ ఘటనా స్థలంలో లభించకపోవడంతో ఆమె వివరాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. చేవెళ్ల డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన యువతి ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనేది తెలిస్తే నిందితులను త్వరగా గుర్తించేందుకు అవకాశముంటుందని పోలీసులు భావిస్తున్నారు.

 

Leave a Comment