అదనపు కట్నం వేధింపులు.. పెళ్లయిన 6 నెలలకే నవవధువు ఆత్మహత్య..!

ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. కానీ పెళ్లయిన నాటి నుంచి భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించారు. పెళ్లయిన ఆరు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి. దీంతో ఆ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చివరగా తన భర్తకు ఫోన్ చేసి తనను ఎందుకు విడిచి వెళ్లావు అంటూ రోధించింది. భర్త ప్రణయ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. 

వివరాల మేరకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన ఎడ్ల లావణ్య(25) బీఎస్సీ వెటర్నరీ పూర్తి చేసింది. ఆమె సూర్యాపేటలోని బంధువుల వద్ద ఉంటూ తన వెటర్నరీ సైన్స్ చదివింది. ఆ సమయంలో సూర్యాపేట చర్చి కాంపౌండ్ కు చెందిన ప్రణయ్ తో ప్రేమలో పడింది. ప్రణయ్ సూర్యాపేట మండలం బాలెంల గ్రామ వ్యవసాధికారిగా పనిచేస్తున్నాడు.  

ఐదేళ్లుగా ప్రేమించుకున్న వీరు 2020 జూన్ 12న పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. లావణ్య తండ్రి సుందరయ్య కట్నంగా రూ.4 లక్షలు, 8 తులాల బంగారం, 20 గుంటల సాగు భూమిని ఇచ్చాడు. కొంత కాలం వీరి కాపురం సక్రమంగా సాగినప్పటికీ కొద్ది రోజులుగా అదనపు కట్నం తేవాలని ప్రణయ్, అతడి కుటుంబ సభ్యులు లావణ్యను వేధిస్తున్నారు. 

కట్నం తీసుకురావాలంటూ ఈనెల 1న సాయంత్రం భార్య లావణ్యను ప్రణయ్ అత్తారింటి వద్ద దింపి వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన లావణ్య.. ఈనెల 2న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరి క్షణాల్లో భర్త ప్రణయ్ కు ఫోన్ చేసి ‘నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు.. నేను పురుగుల మందు తాగాను’ అంటూ రోధిస్తూ ప్రశ్నించింది. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి లావణ్య మరణించింది.  

లావణ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు చర్చి కాంపౌండ్ లోని ప్రణయ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. లావణ్య మృతికి భర్త ప్రణయ్, అతడి తల్లిదండ్రులు కరుణానిధి, ఉజ్వల, సోదరుడు సంజయ్ కారణమంటూ లావణ్య తండ్రి సుందరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

పురుగుల మందు తాగిన ప్రణయ్..

విషయం తెలుసుకున్న వెంటనే ప్రణయ్ భార్య మృతదేహాన్ని చూసేందుకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ లావణ్య బంధువులు ప్రణయ్ ను తిట్టారు. కాగా లావణ్య మృతదేహంతో బంధవులు ఆందోళన చేస్తున్న సమయంలో ప్రణయ్ పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికి ఆస్పత్రికి తరలించారు.  

ప్రణయ్ వద్ద ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో ఇలా ఉంది..‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. నా భార్య లావణ్య దగ్గరికి వెళ్లిపోతున్నా.. నా భార్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి.. చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య’ అని రాసి ఉంది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

 

Leave a Comment