ఆడ పిల్లలు పుట్టారని.. పచ్చి బాలింతను హత్య చేసిన భర్త..!

కాపురం చేయడానికి అయితే భార్య కావాలి. కానీ అదే భార్య తన కడుపున ఆడ పిల్లలకు జన్మనిస్తే మాత్రం తట్టుకోలేదు ఈ మగ జాతి. వరుసగా ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనివ్వడమే ఆ తల్లి చేసిన నేరమైంది.. పచ్చి బాలింత అని చూడకుండా అతికిరాతకంగా హతమార్చాడు ఓ భర్త.. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. 

గద్వాల పట్టణం నల్లకుండా ఈదమ్మ గుడి దగ్గర నివాసం ఉంటున్న వెంకటేశ్ కు వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన ఆంజనేయులు కూతురు పల్లవి(26)కి 2019లో వివాహం చేశారు. రూ.6 లక్షలు, 6 తులాల గోల్డ్, ప్లాట్ ను కట్నంగా ఇచ్చారు. వెంకటేశ్, పల్లవికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భార్యను వెంకటేశ్ వేధిస్తున్నాడు. ఈనెల 22న రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ముగ్గురు ఆరోగ్యంగా ఉండటంతో శనివారం వారిని డిశ్చార్జ్ చేశారు.

డిశ్చార్జ్ అయినప్పటి నుంచి వేధించడం మొదలుపెట్టాడు. ఆడపిల్లలు పుట్టారు కాబట్టి అదనపు కట్నం తీసుకురావాలని పల్లవితో గొడవకు దిగాడు. ఈక్రమంలో ఆదివారం ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఫట్స్ వచ్చి చనిపోయిందని పల్లవి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోస్టు మార్టం నిర్వంచగా ఆమెను పథకం ప్రకారం హత్య చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment