సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో బూతులు మాట్లాడేవారిపై కేసులు నమోదు చేస్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణాకు వెళ్లి ఒకరిని అరెస్ట్ చేశామని, చిత్తూరులో మరొకరిని అరెస్ట్ చేశామని తెలిపారు.
డీజీపీ కార్యాలయంలో సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం వాట్సప్ నెంబర్ను ఆయన ప్రారంభించారు. దీని ద్వారా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తల ప్రచారాలను అరికట్టవచ్చు అన్నారు. ప్రత్యేక వాట్సప్ నంబర్ 9071666667 ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జామ్ యాప్ ద్వారా బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు నిఖిల్ సిద్ధార్థ, అడవిశేష్ ఆన్లైన్లో ఇంట్రాక్ట్ అయ్యారు.
కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదు..
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. కొత్తగా పుట్టుకొస్తున్న నేరాలను పోలీసులు ఎల్లప్పుడూ అరికడుతున్నారని తెలిపారు. నేరాలు అరికట్టడంలో ప్రజలందరి సహాకారం అవసరమని కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యం రాజ్యాగంలో అందరికీ హక్కులు ఉన్నాయని, ఏది వాస్తవమో ఏదీ అవాస్తవామో అందరూ తెలుసుకోవాలని అన్నారు.
చాలామంది వాస్తవం తెలుకోకుండా అసత్యాలు ప్రచారం చేస్తుంటారని, అలాంటి వాటిని ఏపి పోలీస్ అరికడుతుందన్నారు. మహిళలు పిల్లలను ఆదుకునేందుకు సీఎం జగన్ దిశ చట్టం, దిశా కంట్రోల్ రూంలు తెచ్చారని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు తిరిగి రావడం వల్ల, డిల్లీ నిజాముద్దీన్ ద్వారా మన రాష్ట్రంలోకి కరోనా వచ్చిందని, వారిని 22 వేల మందిని గుర్తించి హోం క్వారెంటైన్ చేశామని తెలిపారు. కరెన్సీ నోట్లపై కరోనా ఎక్కువ సమయం ఉండదని, వీటి ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉండదని అన్నారు.