ఆ లెక్కలు కేంద్రానికి చెప్పారా?

కన్నాపై విజయసాయిరెడ్డి ఫైర్

2019 ఎన్నికల సమయంలో బీజేపీ అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయసాయి వ్యాఖ్యానించారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీలో కన్నా, పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? ఏయే నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారనే వివరాలు లెక్కలతో సహా తన వద్ద ఉన్నట్లు చెప్పారు.

 ఆయా ఖర్చులను బీజేపీ అధిష్ఠానానికి అందజేశారా? అని ప్రశ్నించారు. ఆ డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది కూడా తాను చెప్పగలనన్నారు. అది ఆ పార్టీ అంతర్గత విషయం కాబట్టి ఆ వివరాలను తాను బయట పెట్టదలచుకోలేదన్నారు. కన్నా రూ.20కోట్లకు అమ్ముడుపోయారని మరోసారి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అవసరమైతే కాణిపాకం వినాయకుడి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి ఈ విషయాలన్నీ చెప్పగలనన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని..అంతా సక్రమంగానే జరుగుతోందని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నుంచి నుంచి వెళ్లిన నేతలతో బీజేపీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని విమర్శించారు. కన్నా అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని వ్యాఖ్యానించారు.

 

Leave a Comment