ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయం

విజయసాయి రెడ్డి

అమరావతి : రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని అన్నారు. శిఖండిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసే యుద్ధం ఎల్లో మీడియాను ఉత్సాహపరుస్తుంది, కానీ పరాజయాన్ని మాత్రం నిలువరించలేదని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలు వాయిదా వేసి పరువు నిలబెట్టినందుకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఫోటోకు టీడీపీ కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.

నిజంగా కరోనా భయానికే ఎన్నికలు వాయిదా వేసి ఉంటే చంద్రబాబు స్టేట్‌మెంట్లు మరోలా ఉండేవి. వాయిదాతో పరాజయ భారాన్ని కొద్ది రోజులు తప్పించుకున్నాడు’  అని ఎద్దేవా చేశారు. ‘ఎలక్షన్ కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుపేదలకు ఊరట కలిగించాయి. పంపిణీ చేసే స్థలాల్లో గృహ నిర్మాణం కోసం సిమెంట్ ధరలను భారీగా తగ్గించేలా కంపెనీలను ఒప్పించడం సీఎం జగన్ గొప్ప విజయం.

స్థానిక ఎన్నికలు వాయిదా వేయించి పచ్చ పార్టీ తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంది. గ్రామాలు, పట్టణాల్లో పాలనా వ్యవస్థలు లేక ప్రజలు ఇబ్బందులు పడతారు. బూత్ స్థాయిలో ఏజెంట్ కూడా దొరకని దుస్థితి తెచ్చుకుంది. భయపడి ఇలా ఎన్నాళ్లు తప్పించుకుంటావ్ బాబూ?’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

 

Leave a Comment