కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో టీటీడీ ఆంక్షలు విధించింది. ఘాట్ రోడ్ మూసివేయాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. ఎగువ ఘాట్ రోడ్ లో వాహన రాకపోకలు నిషేధించారు. తిరుమల కొండపై ఉన్న భక్తులను కిందకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కిందికి వెళ్లేందుకు దిగువ ఘాట్ రోడ్డును టీటీడీ తెరిచి ఉంచింది. తిరుమల కొండపై ఉన్న భక్తులు వెంటనే కిందకు వెళ్లిపోవాలని ఆదేశించింది.
వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మెట్ల మార్గం కూడా అధికారులు మూసివేశారు. కరోనా ప్రభావం పెరిగిన నేపథ్యంలో టీటీడీ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తిరుమలలో కరోనా అనుమానిత వ్యక్తిని గుర్తించారు. అతనిని టీటీడీకి చెందిన అస్తమి ఆస్పత్రిలో ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతిలోని సిమ్స్ కు తరలించారు.
అలిపిరి టోల్గేట్ మూసివేత
కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల దర్శనాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అలిపిరి టోల్ గేట్ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీవారి దర్శనాలను నిలిపివేయనున్నారు. అయితే శ్రీవారికి జరిగే ఏకాంత సేవలను అర్చకులు యథాతథంగా నిర్వహించనున్నారు.