అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 109 మంది రక్త నమూనాలు సేకరించగా వారిలో 94 మందికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో 13 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో ప్రకటించింది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం యథావిధిగా పరీక్షల షెడ్యూల్ ఉంటుందని, ఈనెల 31 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను అనుసరించి తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.