ఏపీలో కరోనా నివారణకు రెండు వ్యూహాలు : జవహర్ రెడ్డి

ఏపీలో కరోనా నివారణకు రెండు వ్యూహాలు, కంటైన్మెంట్ క్లస్టర్, ఆస్పత్రుల సదుపాయం అనుసరిస్తున్నామని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 154 క్లస్టర్లు గుర్తించి కంటన్మైంట్ చేశామని చెప్పారు. వైరస్ బారిన పడ్డ వారి కేసుల సంఖ్య పెరిగితే క్వారంటైన్లను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. 

తిరుపతి, కర్నూలులో ఒక్కో ల్యాబ్ అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. గత పది రోజుల్లో 12 వేలకు పైగా నమూనాలు పరీక్షించామని, 32 వేల మంది అనుమానితులకు ’కరోనా‘ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 

గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల్లో గుంటూరు టౌన్ నుంచి ఎక్కువ శాతం కేసులు ఉన్నాయన్నారు. రెడ్ జోన్ లో ఆంక్షలు కొనసాగుతాయని, వరుసగా రెండు వారాల పాటు కొత్త కేసులు నమోదు కాకపోతే రెడ్ జోన్ ను ఆరెంజ్ జోన్ గా మారుస్తారని వివరించారు. ఈ నెల 20 నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూసి మండలాలను మళ్లీ జోనింగ్ చేస్తామని చెప్పారు. పూల్ టెస్టులు నిర్వహించాలనీ నిర్ణయం తీసుకున్నామని, ఉన్న వనరులను పొదుపుగా వాడటమే ఈ టెస్టుల లక్ష్యం అని చెప్పారు.

 

Leave a Comment