ఆ మేరకు కోర్సులు రూపకల్పన
సమీక్షా సమావేశంలో సీఎం జగన్
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య కేంద్ర ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. గురువారం సీఎం క్యాంపు క్యారాలయంలో స్కిల్ డెవలప్ మెంట్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశపెట్టాల్సిన కోర్సులపై సమీక్షలో సీఎం జగన్ చర్చించారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోర్సులు ఉండాలని సీఎం జగన్ తెలిపారు. కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ సహా ఇతర కోర్సులు పూర్తి చేసిన వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడానికి, ఇప్పటికే ఆ తరహా కోర్సులు చేస్తున్నవారికి ఏడాది అప్రెంటిస్ ఇవ్వడమే ఈ యూనివర్శిటీ, నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశాలని స్పష్టం చేశారు.
ఉద్యోగాల కల్పనే ధ్యేయం..
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, శిక్షణ ఇవ్వడమే లక్ష్యమన్నారు. ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తారన్నారు. ప్రతి నైపుణ్య కేంద్రంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ తదితర కోర్సుల విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ది చేయడంతో పాటు జీవనోపాధి కోసం ఇతరులకు చిన్న చిన్న పనులు నేర్పించడానికి శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు.
ఎన్ఐసీ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఒక్కో ఫ్యాకల్టీలో ప్రముఖ సంస్థల భాగస్వామ్యాలు తీసుకోవాలన్నారు. దీని వల్ల ఈ కోర్సులకు మరింత విలువ ఉంటుందన్నారు.
వైద్య రంగంలోనూ శిక్షణ..
వైద్య రంగంలో సర్వీసులకు కూడా ఈ నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ ఇవ్వాలని సీఎం జగన్ తెలిపారు. హైఎండ్ స్కిల్స్ కోసం విశాఖలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఏ కోర్సుకైనా కనీస కాల వ్యవధి 6 నెలలు ఉండాలన్నారు.
ఇప్పటి వరకూ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి వివిధ కోర్సులు చదువుతున్న వారే కాదు, కోర్సులు పూర్తయిన వారు కూడా ఈ కేంద్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అలాగే అధ్యాపకులను అప్గ్రేడ్ చేసేందుకు శిక్షణా తరగతులు కూడా నైపుణ్య కేంద్రాల్లో నిర్వహించాలన్నారు.