దొంగతనానికి వచ్చి.. కూల్ గా నిద్రపోయిన దొంగ..!

పాపం ఎంత అలసిపోయాడో.. ఏకంగా ఓ ఇంటికి దొంగతనానికి వచ్చి కూల్ గా మంచం కింద నిద్రపోయాడు.. అయితే ఇంటి యజమానికి చాకచక్యంగా వ్యవహరించడంతో పోలీసులకు దొరికిపోయాడు.. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. 

 గోకవరంలో సత్తి వెంకటరెడ్డి పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నాడు. రోజులాగే రాత్రి 10.15 సమయంలో బంక్‌ వద్ద పని ముగించుకుని నగదుతో ఇంటికి బయలు దేరాడు. వెంటకరెడ్డిని పసిగట్టిన దొంగ సూరిబాబు ఆయనను ఫాలో అయ్యాడు. వెంకటరెడ్డి ఇంట్లోకి వెళ్లగానే ఇతడు కూడా లోనికి చొరబడి మంచం కింద దాక్కున్నాడు.

 వెంకటరెడ్డి నిద్రపోగానే నగదు ఎత్తుకుపోవాలని సూరిబాబు భావించాడు. కానీ వెంకటరెడ్డి లావాదేవీలకు సంబంధించిన లెక్కలు చూసుకుంటూ రాత్రి ఒంటి గంట వరకు మెలుకువగానే ఉన్నాడు. ఇంతలోనే మంచం కింద దాక్కున్న దొంగ నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారుజామున నాలుగున్నర సమయంలో మంచం కింద నుంచి గురక శబ్దం వస్తుండడంతో మేల్కొన్న వెంకటరెడ్డి మంచం కింద చూడగా దొంగ నిద్రపోతున్నాడు.

 వెంటనే కుటుంబసభ్యులను తీసుకుని బయటకు వెళ్లి ఇంటి బయట గడియ పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి మంచం కింద నిద్రపోతున్న దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. డబ్బులు అత్యవసరమవడంతో దొంగతనానికి వచ్చానని, వెంకటరెడ్డి పెట్రోల్ బంక్‌ డబ్బులతో రోజు ఇంటికి వెళ్తాడని తెలుసుకుని దొంగతనానికి వచ్చానని సూరిబాబు నిజం ఒప్పుకున్నాడు.

Leave a Comment