కాబోయే భర్తను ప్రియుడితో హత్య చేయించిన యువతి..!

ప్రియుడి మోజులో పడి ఓ యువతి కాబోయే భర్తనే హత్య చేయించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. వివరాల మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని మౌళి కాలనీకి చెందిన రేష్మ స్థానిక ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో బీకాం కంప్యూటర్స్ సెకండియర్ చదువుతోంది. ఆమె అదే కాలేజీలో చదువుతున్న క్లాస్ మేట్ శేఖర్ సింగ్ తో ప్రేమలో పడింది. 

ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు రేష్మకు కోటకందుకూరు గ్రామానికి చెందిన మొఘల్ ఖాజా బేగ్ కుమారుడు గఫార్ బేగ్(23) అనే యువకుడితో ఫిబ్రవరిలో పెళ్లి చేయాలని నిశ్చితార్థం చేకున్నారు. పెళ్లి ఇష్టం లేని రేష్మ తన ప్రియుడు శేఖర్ సింగ్ తో కలిసి కాబోయే భర్త గఫార్ బేగ్ ను అంతమొందించేందుకు ప్లాన్ వేసింది. 

అందులో భాగంగా ఈ నెల 26న గఫార్ బేగ్ కు ఫోన్ చేసి ఇంట్లో ఎవరూ లేరని, చూడాలని ఉందని, త్వరగా రమ్మని నమ్మ బలికింది. దీంతో గఫార్ బేగ్ కాబోయే భార్యకు స్వీట్లు, పండ్లు, పూలు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. చీకటి పడేంతవరకు తనతోనే ఉంచుకుని, ఆ తర్వాత వెళ్లమని చెప్పింది. 

అతను వెళ్లే దారిలో ముందుగానే ప్లాన్ ప్రకారం ప్రియుడు శేఖర్ సింగ్, మరో యువకుడు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు గఫార్ బేగ్ వెంట ఫాలో అయ్యారు. గ్రామ శివారులోకి వెళ్లే సరికి బండిని అటకాయించి దాడి చేశారు. నలుగురు కలిసి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. 

మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి కాల్ డేటా ఆధారంగా రేష్మను అదుపులోకి తీసుకుని తమ దైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

Leave a Comment