బట్టలు విప్పి వీడియో తీశారు.. జోగిని శ్యామలపై కేసు వేసిన యువతి..!

జోగిని శ్యామలపై ఓ యువతి కేసు వేసింది. తన బట్టలు విప్పేసి ఫొటోలు, వీడియోలు తీశారని శ్యామలతో పాటు మరో 15 మందిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు. అనంతరం కేసును మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ కు బదలాయించారు. 

వివరాల మేరకు.. సికింద్రాబాద్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న యువతి మార్చి 12న తన తల్లితో కలిసి మెదక్ జిల్లా ఏడుపాయల సమీపంలోని నాగ్సాన్ పల్లిలోని వనదుర్గ భవాని దేవి గుడికి వెళ్లింది. ఆలయ ప్రాంగణంలో వీరికి జోగిని శ్యామల కలిసింది. శ్యామలతో వీరు కాసేపు మాట్లాడారు. 

తర్వాత శ్యామల తాను ఉంటున్న ప్రదేశానికి రావాలని ఆ యువతి, ఆమె తల్లిని ఆహ్వానించింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో వారు అక్కడికి వెళ్లారు. అక్కడ శ్యామలతో పాటు 15 మంది పురుషులు, ఆమె సహాయకురాలు ఉమ ఉన్నారు. అక్కడ వారు యువతిని మద్యం తాగాలని ఒత్తిడి చేశారు. దానికి యువతి ఒప్పుకోలేదు. 

దీంతో బూతులు తిడుతూ వివస్త్రను చేసి ఫొటోలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తర్వాత యువతి, ఆమె తల్లిపై దాడి చేశారు. బాధితురాలు డ్రైవర్ సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని మార్చి 13న నగరానికి చేరుకున్నట్లు చెప్పింది. గాయాలు కావడంతో నేడు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొంది. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.     

Leave a Comment