విషాదం : కట్నం కారణంగా తండ్రికి బరువవుతానుకొని యువతి ఆత్మహత్య..

తన కూతురికి లక్షల్లో కట్నం ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఓ తండ్రి.. కానీ ఆ కట్నం కారణంగా తన తండ్రికి బరువవుతానని భావించింది ఓ కూతురు. తన పెళ్లి కోసం తండ్రి చేస్తున్న అప్పులు చూడలేకపోయింది. తానే లేకపోతే కట్నం ఇవ్వడం కోసం తన తండ్రి లక్షల్లో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని భావించింది. నిశ్చితార్థం అయిన మరుసటి రోజే బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో చోటుచేసుకుంది. 

భూంపల్లి గ్రామానికి చెందిన వాగుమారి ప్రవళిక(26)కు తాడ్వాయి మండలం క్రిష్ణాజివాడి గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈనెల 3న నిశ్చితార్థం కూడా అయింది. పెళ్లికి రూ.8లక్షల నగదు, నాలుగు గుంటల భూమి ఇచ్చేందుకు ప్రవళిక తండ్రి చందర్ రావ్ అబ్బాయి తరపు పెద్దలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 

అసలే పేద కుటుంబం, మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు.. ఇంత మొత్తం ఇచ్చి పెళ్లి ఎందుకు చేస్తున్నారని తల్లిదండ్రులతో చెప్పుకుంటూ ప్రవళిక బాధపడేది. తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేని ఆ యువతి తను లేకపోతే వారికి ఏ కష్టం ఉండదని భావించి గ్రామ సమీపంలోని బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. 

బావిలో దూకే ముందు తన కోసం వెతకవద్దని, తాను బావిలో దూకి చనిపోతున్నానని తన బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. బంధువులు, కుటుంబ సభ్యులు విషయం తెలిసి బావి వద్దకు వెళ్లి పాతాలగరిగెతో వెతకగా శవం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందర్ రావ్ కు ముగ్గురు కూతుళ్లు కాగా ప్రవళిక మూడో కూతురు.  

Leave a Comment