వరకట్నం తీసుకోవడం దేశంలో నిషేధం.. అయినప్పటికీ వరకట్న సమస్య వెంటాడుతూనే ఉంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దేశంలో వరకట్నం నిషేధం ఉన్నప్పటికీ.. చట్టాలు అమలులో లోపాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు..
అయితే ఓ పుస్తకంలో మాత్రం వరకట్నంతో ప్రయోజనాలు ఉన్నాయంటూ రాశారు.. బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పుస్తకం ‘సోషియాలజీ ఫర్ నర్సింగ్’లో ఒక పేరాలో వరకట్నం ప్రయోజనాల గురించి వివరించారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. పుస్తకంలోని ఆ పేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో.. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలో ‘మెరిట్స్ ఆఫ్ డౌరీ’ అంటూ ఓ పేజీలో రాసుకొచ్చారు. అంతేకాదు భారత నర్సింగ్ కౌన్సిలింగ్ సిలబస్ ఆధారంగానే పుస్తకాన్ని రూపొందించినట్లు అందులో రాసి ఉంది. మరి పుస్తకంలో ఏమున్నాయో ఒకసారి చూద్దాం..
వరకట్నంతో ప్రయోజనాలు:
- కొత్త కుటుంబాన్ని, ఇంటిని ఏర్పాటు చేసుకోవానికి వరకట్నం ఉపయోగపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నీచర్ వస్తాయి.
- అమ్మాయికి తల్లిదండ్రుల ఆస్తి కట్నం రూపంలో అందుతుంది.
- కట్నాలు ఇచ్చే స్తోమత లేక కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగంలో చేరితే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇది మంచి ప్రయోజనం..
- అందంగా లేని అమ్మాయిల కోసం వారి తల్లిదండ్రులు వరకట్నం ఇచ్చి పెళ్లి జరిపించవచ్చు.
ఇలా పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి పుస్తకాల్లో పెట్టి విద్యార్థులకు ఏం నేర్పిద్దామని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పుస్తకాల్లో ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు అన్నారు. వెంటనే వాటిని తొలగించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కోరారు.
I request Shri @dpradhanbjp ji to remove such books from circulation. That a textbook elaborating the merits of dowry can actually exist in our curriculum is a shame for the nation and its constitution. https://t.co/qQVE1FaOEw
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) April 3, 2022