తబ్లిగీలను బలిపశువులు చేశారు : ముంబై హైకోర్టు

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ పౌరులను బలిపశువులు చేశారని, కరోనా వ్యాప్తికి వారు కారణమయ్యారని అనవసర ప్రచారం జరిగిందని ముంబై హైకోర్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను శనివారం బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. ఈ మేరకు 29 మందిపై కేసులను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ టీవీ నాలావాడే ఎంజీ సెవ్లికర్లతో కూడి ధర్మాసనం పేర్కొంది. 

ఇక ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని న్యాయస్థానం తెలిపింది. రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది. సోషల్ మీడియాలో కూడా వీరిపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడంతోనే దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ క్రమంలో పర్యటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

50 సంవత్సరాలుగా తబ్లిగా జమాత్ కార్యక్రమం జరుగుతుందని, ఇది ఏడాదంతా సాగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతి భారతదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా అని ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని, ఇలాంటివి మరోసారి పునరావృతం కాకూడదని హెచ్చరించింది… 

Leave a Comment