రాయలసీమ ప్రజలకు సోమువీర్రాజు క్షమాపణలు..!

‘ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాల్లో కూడా ఎయిర్ పోర్టా.. వారికి ప్రాణాలు తీయడమే వచ్చు..’ అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఆయన వ్యాఖ్యలపై రాయలసీమ నేతలు, ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. రాయలసీమ ప్రజల సంస్కృతిని కించపరిచేలా సోము వీర్రాజు వ్యాఖ్యానించారని, వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈక్రమంలో సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించే క్రమంలో వాడిన పదాలు రాయలసీమ ప్రజల మనసులను గాయపరిచాయని, అందుకే వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘రాయలసీమ రతనాల సీమ’ అనే పదం తన హృదయంలో పదిలం అని, రాయలసీమ అభివృద్ధి కోసం అనేక వేదికలపై ప్రస్తావించామని పేర్కొన్నారు. ఈ విషయం రాయలసీమ వాసులకు తెలుసన్నారు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన అని సోము వీర్రాజు పేర్కొన్నారు.   

 

Leave a Comment