ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్.. ఎగబడిన జనం.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఈక్రమంలో ఒక్క రూపాయికే పెట్రోల్ లభించడంతో జనం ఎగబడ్డారు. ఇంతకు ఇది ఎక్కడో తెలుసా?.. మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా శివసేన పార్టీ అభిమానులు లీటర్ పెట్రోల్ ను కేవలం ఒక్కరూపాయికే విక్రయించారు. 

డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ రూపాయికే అందించారు. సుమారు 1200 మంది లీటర్ పెట్రోల్ రూపాయికే పంపిణీ చేశారు. డోంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దిపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేవ్ మత్రేతో సహా మరికొంత మంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూపాయికే లీటర్ పెట్రోల్ ను పంపిణీ చేశారు. 

మొదట ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 నుంచి 12 గంటల వరకు చేయాలనుకున్నారు. రూపాయికే లీటర్ పెట్రోల్ మొదట 500 మందికే ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ ఆఫర్ తెలియడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ప్రజలు భారీ సంఖ్యలో రావడంతో మరో రెండు గంటల పాటు కార్యక్రమాన్ని పెంచి 1200 మందికి పంపిణీ చేశారు. కాగా, ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102కు చేరుకుంది.     

 

Leave a Comment