ఆస్తి తీసుకుని తండ్రికి అన్నం పెట్టని కుమారులు.. ఆమరణ దీక్షకు దిగిన తండ్రి..!

రక్తం పంచుకు పుట్టిన కుమారులు తండ్రికి పట్టడన్నం పెట్టడం లేదు. తిండి పెట్టాలని బతిమిలాడినా పట్టించుకోవడం లేదు.  కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే అప్పులు అంటగట్టడమే కాకుండా పట్టడన్నం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తిని తీసుకుని అన్నం పెట్టని కుమారులపై ఆ తండ్రి తిరుగుబాటు చేశాడు. తనకు తిండి పెట్టాలని బతిమిలాడిన పట్టించుకోవడం లేదంటూ ఆ పెద్దాయన ఆమరణ దీక్షకు దిగాడు. 

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని హన్మకొండ రోడ్డుకు చెందిన కొత్తకొండ స్వామికి సంతోష్ కుమార్, సుధాకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఘనంగా పెళ్లిళ్లు చేశాడు. ఒక్కొక్కరికి రూ.2 కోట్ల ఆస్తిని కూడా పంచి పెట్టాడు. ఆరేళ్ల క్రితం స్వామి భార్య ప్రమీల ఆత్మహత్య చేసుకుంది. 

అప్పటి నుంచి స్వామికి కష్టాలు మొదలయ్యాయి. ఓ నెల రోజు వరకు ఓ కొడుకు అన్నం పెట్టాడని, ఆ తర్వాత నుంచి తానే వండుకునే వాడినని స్వామి తెలిపాడు. తనకు తిండి పెట్టేవారు లేక ఎనిమిది నెలల పాటు కొమురవెల్లి వద్ద ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్నానని, అక్కడ చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పాడు. తనకు రూ.13 లక్షల అప్పులు ఉన్నాయని, పెద్ద కొడుకు సంతోష్ కుమార్ కు రూ.10 లక్షలు అప్పు ఇప్పించానని, అవి తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఇద్దరు కొడుకులు తనను పూర్తిగా పట్టించుకోవడం లేదన్నాడు. ఈ వయస్సులో అన్నం పెట్టే దిక్కులేక న్యాయం కోసం ఆమరణ దీక్ష చేస్తున్నానని స్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. 

  

Leave a Comment