ఓ సామాన్య రైతు ఖాతాలో ఏకంగా రూ.473 కోట్లు జమ అయ్యాయి. ఇది చూసిన రైతు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామానికి చెందిన అనుమూల సంజీవరెడ్డి అనే రైతుకు భువనగిరిలోని డక్కన్ గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్ ఉంది. సంజీవరెడ్డికి డబ్బులు అవసరం ఉండటంతో డీసీసీబీ ఏటీఎం సెంటర్ కు వెళ్లాడు.
అక్కడ ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిచగా.. డబ్బులు రాలేదు. ఎన్నిసార్లు డబ్బుల కోసం ప్రయత్నించిన రాకపోవడంతో.. అసలు తన అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయో చెక్ చేసుకున్నాడు. అంతే తన ఖాతాలో రూ.473,13,30,000 ఉన్నాయి. దీంతో రైతు షాక్ అయ్యాడు.
ఆ ఏటీఎంలో ఏమైన తప్పుడు రిసిప్ట్ వచ్చిందేమోనని ఎస్బీఐ ఏటీఎంలో కూడా చెక్ చేసుకున్నారు. అక్కడ కూడా అదే బ్యాలెన్స్ చూపించింది. దీంతో ఆ రైతు డక్కన్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లి విషయం తెలిపాడు. బ్యాంక్ అధికారులు అతని అకౌంట్ చెక్ చేసి అకౌంట్ ఫ్రీజ్ అయిందని, ఏటీఎం సర్వర్ పనిచేయడం లేదని రైతుకు చెప్పారు. ఏటీఎం రిసిప్ట్ లో ఇంత బ్యాలెన్స్ ఎందుకు ఉందని అడగ్గా.. మీ ఖాతాలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని సమాధానం చెప్పారు. దీంతో సంజీవరెడ్డికి ఏం అర్థం కాక అక్కడి నుంచి వెనుదిరిగాడు.