బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ శ్రీరాముడి విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని వ్యాఖ్యానించారు. రాముడు కేవలం తులసీదాస్, వాల్మీకి సృష్టించిన పాత్ర మాత్రమే అని చెప్పారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, వాటిలో మంచి విషయాలు ఉన్నాయని అన్నారు.
బీహార్ లోని జమయి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాముడి పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ రచనల్లో చొప్పించారని అన్నారు. తులసీదాస్, వాల్మీకిపై తమకు పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు.
దేశంలో కుల విభజనను ప్రస్తావిస్తూ.. దేశంలో రెండు కులాలు మాత్రమే ఉన్నాయన్నారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈక్రమంలో రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నామని, అయితే తాము కొరికిన పండ్లను మీరు తినరు, ముట్టుకోరు అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో దళితుల పట్ల బ్రాహ్మణులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశంలో చర్చనీయాంశంగా మారాయి.
#WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, “Ram wasn’t a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created ‘kavya’ & ‘mahakavya’ with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram..” pic.twitter.com/ayrQvSfdH1
— ANI (@ANI) April 15, 2022