ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. గురువారం తెల్లవారుజామున ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విట్టర్ ప్రతినిధులు ధ్రువీకరించారు. దీనిపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. కోవిడ్-19 నేపథ్యంలో పీఎం నేషనల్ ఫండ్ ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని ఆయన కోరినట్లు సైబర్ నేరగాళ్లు ట్వీట్లు చేశారు. ప్రధాని మోడీ అకౌంట్ జాన్ విక్ పేరుతో హ్యాక్ కు గురైంది. జాన్ విక్ గ్రూపుకు పేటీెం మాల్ డేటా చోరీ కేసులో హ్యండ్ ఉందని ఆరోపణలు ఉన్నాయి.
కాగా, ప్రధాని ట్విట్టర్ అకౌంట్ కు 25 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అకౌంట్ నుంచి మోడీ 37 వేల ట్వీట్లు చేశారు. ఇక ట్విట్టర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో ఎంతో మంది ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్ గురయ్యాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ తదితరుల ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కు సంబంధించి కేంద్ర సైబర్ క్రైం విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది.