మహిళపై భూతవైద్యుడి అత్యాచారయత్నం.. హత్య.. హంతుకుడిని కొట్టి చంపిన గ్రామస్తులు..!

ఓ మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన భూత వైద్యుడు.. ఆమె ప్రతిఘటించడంతో కత్తితో నరికి చంపాడు.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసుల ముందే ఆ భూతవైద్యుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. 

కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి(42) కాళ్ల నొప్పులతో బాధపడుతోంది. గ్రామంలోని వడ్డెపాలెంలో తన్నీరు ఓబిశెట్టి(62) బేల్దారి పని చేసుకుంటూ చిన్ని చిన్న సమస్యలకు అంత్రాలు వేస్తుంటాడు. మూడు నెలల క్రితం అతడి భార్య చనిపోయింది. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో విజయలక్ష్మి అంత్రం వేయించుకునేందుకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఓబిశెట్టి .. విజయలక్ష్మిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి ఆమె ప్రతిఘటించి గట్టిక కేకలు వేసింది. దీంతో కొత్తితో ఆమె గొంతుకోసి.. ఒళ్లంతా పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. 

ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో ఎస్సై రజియా సుల్తానా ఘటనా స్థలానికి చేరుకుని ఓబిశెట్టిని స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కామేపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీస్ వాహనంలో ఉన్న ఓబిశెట్టిని బయటకు లాగి కర్రలతో మూకుమ్ముడిగా దాడి చేశారు. అడ్డుకోబోయిన ఎస్సై రజియా సుల్తానాపైనా దాడి చేశారు. ఈ దాడిలో ఓబిశెట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలాన్ని సీఐ లక్ష్మణ్, కొండపి ఎస్సై రాంబాబు పరిశీలించారు. 

 

Leave a Comment