రూపాయికే లీటర్ పెట్రోల్.. క్యూకట్టిన జనం..!

దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వాహనాలు బయటకు తీయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ కొనాలంటే జేబులు ఖాళీ అయ్యే ఈ సమయంలో ఎవరైనా రూపాయికే పెట్రోల్ ఇస్తామంటే.. ఊరుకుంటామా.. పరుగున వెళ్లి క్యూ కట్టేస్తాం కదూ.. ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం రూపాయికే లీటర్ పెట్రోల్ అని ఇవ్వడంతో జనాలు ఎగబడ్డారు.. 

అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం గురువారం ఈ ఆఫర్ ప్రకటించింది. తొలుత వచ్చిన 500 మందికి కేవలం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎక్కడెక్కడి నుంచో వాహనదారులంతా ఆ పెట్రోల్ బంక్ ముందు క్యూకట్టారు.

వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రోజురోజుకు పెట్రోల్ ధరలను పెంచుతూ మోడీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది..సామాన్యులకు భారంగా మారిన పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రధాని మోడీకి సందేశం ఇచ్చేందుకే రూపాయికే పెట్రోల్ అందించినట్లు బంక్ యాజమాన్యం తెలిపింది.      

Leave a Comment