రూ.50 కోసం గొడవ.. ఒకరి ప్రాణం తీసింది..!

 50 రూపాయల కోసం జరిగిన గొడవ ఒక టెర్రరిస్టును జైల్లో పెట్టించింది. ఇది క్రాక్ సినిమాలోని ఒక సీన్.. ఇక్కడ 50 రూపాయల విషయంలో జరిగిన గొడవ  ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 

ఏం జరిగిందంటే.. సత్తెనపల్లిలోని పాత మార్కెట్ వద్ద శ్రీలక్ష్మి మారుతి సంగం పార్లర్ ఉంది. అక్కడ పల్లపు కోటి వీరయ్య అనే వ్యక్తి 15 రోజుల క్రితం కొన్ని వస్తువులు తీసుకున్నాడు. రూ.50 ఫోన్ పే చేయగా అది ఫెయిల్ అయింది. దీంతో రూ.50 తర్వాత ఇస్తానని వీరయ్య వెళ్లిపోయాడు. అయితే వీరయ్య మళ్లీ ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో షాపు యజమాని వైకుంఠవాసి మూడు, నాలుగుసార్లు డబ్బల కోసం అడిగాడు. 

అయినా వీరయ్య ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. షాపు యజమాని అడుగుతుండటంతో రెండు రోజుల కిందట వీరయ్య సోదరుడు నాగేశ్వరరావు ఆ రూ.50 చెల్లించాడు. దీంతో వీరయ్య మనస్తాపం చెందాడు. తన మరో సోదరుడు తిరుమలేశ్వరరావుతో కలిసి బుధవారం రాత్రి 10.30 సమయంలో సంగం పార్లర్ వద్దకు వచ్చి వైకుంఠవాసితో గొడవకు దిగాడు. 

వారిద్దరి మధ్య గొడవ జరుగుతుండటంతో షాపులో గుమస్తాగా పనిచేస్తున్న షేక్ బాజీ(27) సర్దిచెప్పేందుకు వెళ్లాడు. ఆ గొడవలో దెబ్బలు తగలడంతో బాజీ కింద పడి స్పృహ కోల్పోయాడు. వెంటనే బాజీని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బాజీ కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment