విలేజ్, వార్డు సెక్రటేరియట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రొబేషనరీ పిరియడ్ రెండు సంవత్సరాలు పూర్తయ్యేవరకూ బదిలీలు, డిప్యుటేషన్లు ఉండవని నిర్ణయించారు. విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్లలో పనిచేస్తున్న గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బందికి శిక్షణ, సేవలపై పంచాయితీరాజ్ కమిషనర్ కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్జైన్, విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ కమిషనర్ నవీన్కుమార్, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పధకాలు అర్హులైన ప్రతి లబ్దిదారుడికి సత్వరం అందేలా చర్యలుండాలని, వల్లో ఏ మాత్రం జాప్యం జరగరాదు. ఇందుకవసరమైన పూర్తిస్ధాయి శిక్షణ ఇవ్వాలని మంత్రులు పేర్కొన్నారు. 800 మంది ప్రిన్సిపల్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికే వారం రోజుల పాటు మొదటి విడత శిక్షణ ముగిసిందన్నారు. 248 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు ఆధార్ సర్వీసెస్ ట్రైనింగ్ పూర్తయిందని అధికారులు వెల్లడించారు.
ఆధార్ డేటాలో తప్పుడు సమాచారం నమోదు చేయకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. డివిజనల్ లెవల్ ట్రైనింగ్ ఇప్పటికే 6 జిల్లాలలో పూర్తయిందని, మిగిలిన 7 జిల్లాలలో డిసెంబర్ 2 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. మండలస్ధాయి ట్రైనింగ్ కూడా 6 జిల్లాలలో జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సాఫ్ట్స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుందన్నారు.
నాన్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ వారికి డిజిటల్ లిటరసీ ట్రైనింగ్ ఉంటుందని, డిజిటల్ అసిస్టెంట్లు, వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, పంచాయితీ సెక్రటరీలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు ఈ– సర్వీస్ ట్రైనింగ్ ఇప్పటికే నాలుగు విడతలు పూర్తయిందని తెలిపారు. అనంతరం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అవసరమైన అధునాతన సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ట్రైనింగ్ విషయంలో సమావేశంలో చర్చించారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.