ఎలా బతకాలో అర్థం కావట్లేదు.. మూగ కుమారుడిని కొంగుకు కట్టుకొని కాల్వలో దూకిన తల్లి..!

తన ఐదేళ్ల మూగ కుమారుడిని కొంగుకు కట్టుకుని కాల్వలో దూకింది ఓ తల్లి.. ఈఘటనలో బాలుడు మరణించగా.. ఆమె అపస్మారస్థితిలో ఉంది. ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. ‘నన్ను క్షమించండి.. ఎలా బతకాలో అర్థం కావడం లేదు’ అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియాలో ఆదివారం జరిగింది. 

నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన చిన్న వెంకట లింగయ్యకు 2016లో అనుమల మండలం కొత్త పల్లి గ్రామానికి చెందిన హేమలత(30)తో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు విశాల్ శివ(5) పుట్టతో మూగ.. చిన్న వెంకట లింగయ్య పీహెచ్డీ, ఉన్నత చదువుల కోసం కుటుంబంతో సహా హైదరాబాద్ లోని తార్నాకలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 

దసరా సందర్భంగా హేమలత తన పుట్టినిల్లు కొత్తపల్లికి వచ్చింది. భర్త ఫోన్ చేసి సోమవారం హైదరాబాద్ వెళ్దామని అన్నాడు. దీంతో హేమలత షాపింగ్ కు వెళ్తున్నానని తన పెద్ద కొడుకుని తీసుకుని హాలియా వచ్చింది. అక్కడ ఎడమ కాల్వ గేట్ల వద్ద కొడుకుని చీరకొంగుతో నడుముకు కట్టుకుని కాల్వలోకి దూకింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని ఒడ్డుకు చేర్చారు. అయితే బాలుడు మరణించగా.. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించారు. ఆమె ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. నన్ను క్షమించండి.. ఎలా బతకాలో అర్థం కావడం లేదని అందులో రాసింది. కొంతకాలంగా హేమలత కుమారుడి పరిస్థితిపై ఆందోళన చెందుతుందని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment