నాలుగో పెళ్లి కోసం..నాలుగేళ్ల కొడుకును చంపిన తల్లి..!

కన్న తల్లి అంటే తన కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది..అయితే తన సుఖం కోసం ఓ కన్న తల్లి కసాయిగా మారింది. తన నాలుగేళ్ల కొడుకునే చంపేసింది. ఈ ఘటన బీహార్ లోని షాజహన్ పూర్ లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..ధర్మశీల దేవి అనే మహిళ అరుణ్ అనే వ్యక్తితో తొలుత వివాహం చేసుకుంది. వీరికి సజన్ అనే బాబు ఉన్నాడు. 

పెళ్లి అయిన ఏడాది తర్వాత ధర్మశీల దేవి మరియు అరుణ్ విడిపోయారు. ఆ తర్వాత ఆమె మరో వివాహం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయాడు. అనంతరం పట్నాలోని ముస్తాఫాపూర్ కు చెందిన మహేష్ చౌదరిని పెళ్లి చేసుకుంది. ఆమె దురదృష్టం ఏంటంటే.. పెళ్లయిన రెండు నెలలే మహేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆమె బహదూర్ చౌక్ లోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది..ఆమె కొడుకు సజన్ వినికిడి, కంటి చూపు సమస్యతో బాధపడుతున్నాడు. 

వితంతువుగా ఉన్న దేవి మరో పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ పెళ్లికి తన కుమారుడు సజన్ అడ్డుగా ఉన్నాడు. పెళ్లికి అడ్డుతొలగించుకోవడం కోసం తన కుమారుడిని నీటిలో మునిగిపోయేలా చేసి అతని ప్రాణాలు తీసింది. నీటిలో బాలుడి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దేవిని అరెస్టు చేసి విచారించగా..నేరాన్ని ఆమె అంగీకరించింది. నాలుగో పెళ్లి చేసుకోవడం కోసమే తన కొడుకును చంపినట్లు తెలిపింది. 

 

 

 

Leave a Comment