మీడియా నియంత్రణలో ఉండాలి : డీజీపీ గౌతం సవాంగ్‌

 ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచురుణలు, ప్రసారాలు చేసేవారు, అభిప్రాయలు వ్యక్తీకరించే వారు నియంత్రణ పాటించక పోతే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. 

ఈ మధ్య కాలంలో మీడియాలో  నియంత్రణ లేకుండా  రెచ్చ గొట్టే విధంగా ప్రచురిస్తున్న వార్తలు వల్ల సమాజంలో అలజడి రేగుతోందన్నారు.  పరిస్థితులు వ్యక్తిగత దూషణల నుండి మొదలై వైషమ్యాల వైపునకు దారితీస్తున్నాయన్నారు.  ఫలితంగా అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని, ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిది కాదని చెప్పారు.  

ఇలాంటి పోకడలను అరికట్టే క్రమంలో పోలీసు శాఖ ఈ మధ్య కాలంలో శాఖా పరమైన వ్యవస్థ లను పటిష్టం చేసుకుంటోందన్నారు. సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రై మ్‌ వింగ్‌ లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు  ప్రత్యేకంగా మరో వింగ్‌ ను  ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే పలు ఫిర్యాదులు రావడం, వాటి దర్యాప్తు వేగవంతం చేయడం జరుగుతూ ఉందన్నారు.

 అదే విధంగా మాధ్యమాలలో  రాజ్యాంగ బద్ద సంస్థల పట్ల మరియు ఆ సంస్థల నిర్వహణలో ఉన్న వ్యక్తుల పట్ల వ్యాఖ్యలు చేయడం, వాటిని ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం సరికాదని హెచ్చరించారు. ప్రచురించే, ప్రసారం చేసే సమాచారంలో, అభిప్రాయాల వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలన్నారు. 

 వక్రీకరణ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఇవ్వడం, ఊహాజనిత అంశాలను ప్రసారం చేయడం, ప్రచురించడం, అశ్లీల, అసభ్యకర, నిందపూర్వక, అభ్యంతరకర వ్యాఖ్యానాలు చేయడం గర్హనీయమన్నారు. ఈ విషయంలో చట్ట ప్రకారం వ్యవహరిస్తామని హెచ్చరించారు. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పట్ల, వారి తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారన్న విషయంలో హై కోర్ట్‌ ఇచ్చిన ఫిర్యాదు పై దర్యాప్తు వేగవంతం చేశామని డీజీపీ తెలిపారు. అలాగే ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ పరంగా ఏర్పడ్డ సంస్థల  గౌరవానికి, వ్యవస్థల గౌరవానికి భంగం కలిగేలా  ప్రవర్తించరాదని హెచ్చరించారు. 

Leave a Comment