ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల ఇళ్లకు పంపితే చర్యలు..

ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపడం మానుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్. కాంతారావు గారు హెచ్చరించారు. కమిషన్ సభ్యుల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు పలు అంశాలను విస్తృతంగా చర్చించారు. తమ సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించారు. 

కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు తమ సిబ్బంది జీతాన్ని అడ్మిషన్లతో ముడిపెట్టి వేధించడం సరికాదన్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఇలాంటి చర్యలకు పాల్పడితే సంబంధిత పాఠశాలలు, కళాశాలల గుర్తింపు రద్దు చేసేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ విద్యాసంస్థలోనైనా ఇలాంటివి మళ్లీ జరిగితే apsermc.ap.gov.in పోర్టల్ లో గ్రీవెన్స్ ద్వారా తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

ఫీజులు చెల్లించలేదు అన్న నెపంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలు టిసిలు మంజూరు చేయడం లేదని, విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరాదని కమిషన్ సభ్యులు తీర్మానించారు. 

ప్రైవేటు పాఠశాలల గుర్తింపు మరియు రెన్యువల్ కు సంబంధించిన జిఓ ఎంఎస్ నెంబర్ 1 ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాల్సి ఉందని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సీబీఎస్సీ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మరింత పారదర్శకంగా వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆన్లైన్ సింగిల్ విండో సిస్టంను తీసుకురావాలని సూచించారు. తద్వారా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఉపాధ్యాయులు డిప్యుటేషన్ మరియు ఫారిన్ సర్వీస్ మీద పనిచేస్తున్నారని వీరందరిని తిరిగి పాఠశాలకు తీసుకురావాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 

ప్రస్తుతం టీవీ మాధ్యమంగా ప్రభుత్వం ప్రసారం చేస్తున్న పాఠాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చేర్చాలని, తద్వారా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్న ఇంగ్లీష్ మీడియంకు అలవాటు పడతారని పాఠశాల విద్యా నియంత్రణ మరియు పరిరక్షణ కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

 

Leave a Comment