కర్నూలు జిల్లాలో సినిమాను తలపించే ఘటన.. ప్రియుడితో లేచిపోతూ బైక్ పై..!

కర్నూలు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ప్రియుడితో లేచిపోతూ బైక్ పై నుంచి కిందపడి యువతి మృతి చెందింది. వివరాల మేరకు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన అరుణ, ప్రకాశం జిల్లా మార్కాపురంలోని లక్ష్మీనగర్ కు చెందిన వెంకటేశ్వర్లు బీటెక్ చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం అరుణకు తన మేనమామ కొడుకుతో నిశ్చాతార్థం జరిగింది. ఈనెల 20 పెళ్లి జరిపిచాలని నిశ్చయించారు. 

దీంతో పెళ్లి పనులు మొదలుపెట్టేశారు. అందులో భాగంగా అరుణ కుటుంబ సభ్యులు బంగారం కొనేందుకు కర్నూలు వెళ్లారు. ఈ విషయం వెంకటేశ్వర్లుకు తెలిసింది. దీంతో బైక్ తీసుకొని మార్కాపురం నుంచి బొమ్మిరెడ్డిపల్లికి వచ్చాడు. తన ప్రేయసి అరుణను బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడు. బేతంచెర్ల మండలం యంబాయి గ్రామం దగ్గర బైక్ మీద నుంచి అరుణ కింద పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. 

వెంటనే అరుణను సమీపంలో ఉన్న హుసేనాపురం ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వైద్యులు వద్దని చెబుతున్న వినకుండా వెంకటేశ్వర్లు.. అరుణ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు. మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్తండగా పాణ్యం పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. అరుణ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాణ్యం పోలీసులు వెంకటేశ్వర్లును వెల్దుర్తి పోలీసులకు అప్పగించారు.

అయితే అరుణ బంధువులు మాత్రం ఆమెను వెంకటేశ్వర్లు హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. మేనమామ కొడుకుతో నిశ్చితార్థం చేసుకుందని, అప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉందని అంటున్నారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యే అని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.  

Leave a Comment