కరోనాకు భయపడి ఆక్సీజన్ పెట్టుకుని ఉంటున్నాడు..

చంద్రబాబుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శలు

రాష్ట్రంలో ఇప్పటికే 1.30 కోట్లకు పైగా ప్రజలు ప్రభుత్వం ఉచితంగా అందించిన రేషన్ సరుకులు తీసుకున్నారని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  ప్రభుత్వం 14 లక్షల రేషన్ కార్డులు తొలగించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అర్ధంలేని ఆరోపణలతో గగ్గోలు పెడుతున్నారన్నారు. 

చంద్రబాబు కరోనా దెబ్బకు బయపడి అద్దాల మేడలో… ఆక్సిజన్ పెట్టుకుని ఉంటున్నాడని,  అందుకే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చంద్రబాబుకి సమాచారం తెలియటం లేదని కొడాలి నాని విమర్శించారు.  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా అధికారం లోకి వచ్చిన తరువాత 1.47 కోట్ల రేషన్ కార్డులపై విచారణ చేయించారన్నారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం 10 లక్షల కార్డులు అనర్హులుకు ఇచ్చారనే విషయం బయటపడిందన్నారు. 

చంద్రబాబు నాయుడు అనర్హులుకు ఇచ్చిన 10 లక్షల కార్డులను తొలగించామన్నారు.  కరోనా మహమ్మారి సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన కార్డులకు కూడా ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 సాయం కూడా అందించారన్నారు. రాష్ట్రంలో మరో 3 లక్షల మంది కొత్తగా  బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు.

 వారికి కూడా సీఎం జగన్మోహన్ గారు ఉచిత రేషన్ సరుకులతో పాటు రూ. 1000 ఆర్థిక సహయం అందించమని అదేశాలు జారీ చేశారన్నారు. సీఎం జగన్ సారథ్యంలో ఉన్న ఈ ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వమని, చంద్రబాబులా పేదలను విస్మరించే ప్రభుత్వం కాదని చెప్పారు. 

Leave a Comment