అక్రమ సంబంధాన్ని బయటపెడుతుందని.. బాలికను చంపిన తల్లి, తాత..!

భర్త తండ్రితో అక్రమ సంబంధాన్ని బయటపెడుతుందేమోనని కన్నకూతురినే చంపింది ఓ మహిళ.. దానిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసులకు చిక్కారు.. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ లో జరిగింది. వివరాల మేరకు బోనకల్ కు చెందిన పాలెపు నరసింహారావు కుమారుడు హరికృష్ణకి సునీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ తరుచూ దూర ప్రాంతాలకు వెళ్తుండేవాడు.

కొంత కాలంగా సునీత తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల తన తల్లి, తాతతో ఒకే గదిలో ఏకాంతంగా ఉండటాన్ని సునీత పెద్ద కుమార్తె మహాదేవి(12) చూసింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని కూతురు చెప్పడంతో భయపడిపోయిన తల్లి, తాత ఆమెను హత్య చేశారు. 

ఈనెల 8న మహాదేవి కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడ బిగించి చంపారు. ఆ తర్వాత తన కూతురు ఫిట్స్ తో కిందపడటంతో దెబ్బ తగిలిందని బాలికను పీహెచ్ సీకి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే పీహెచ్ సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని, బాలికను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. 

అక్కడికి తీసుకెళ్లగా.. బాలిక మెడపై కమిలిన గాయాలు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలికకు పోస్టు మార్టం నిర్వహించారు. బాలిక హత్యకు గురైనట్లు రిపోర్టు వచ్చింది. దీంతో తల్లిని, తాతను విచారించగా అసలు విషయం బయటపడింది. తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు వారిని అరెస్ట్ చేశారు. 

 

Leave a Comment