పెళ్లి వేధింపులతో జవాన్ ఆత్మహత్య..!

ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయడంతో బీఎస్ఎఫ్ జవాన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు భీంపూర్ మండలంలోని బెల్సరీ రాంపూర్ గ్రామానికి చెందిన గెడాం మారుతి(30) బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. 

ప్రస్తుతం మేఘాలయలోని 11వ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్న మారుత గత నెలలో సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో మారుతికి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే మారుతికి పార్వతీబాయి అనే భర్త వదిలేసిన మహిళతో గతంలో పరిచయం ఉండేది. 

ఇప్పుడా మహిళా మారుతిని ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకోవాలని వేధిస్తోంది. దీనిపై గ్రామ పెద్దల వద్ద పంచాయతీ కూడా పెట్టారు. పార్వతీబాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని మారుతి చెప్పాడు. అయితే ఆ మహిళా తనను పెళ్లి చేసుకోకపోతే కేసు పెడతానని మారుతిని బెదిరించింది. 

దీంతో మారుతి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయటపడుకుంటానని చెప్పి ట్రాక్టర్ లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించి ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

 

Leave a Comment