ఏం కష్టమొచ్చిందో.. ముగ్గురు స్నేహితురాళ్లు ఆత్మహత్య..!

ఏం అంత కష్టం వచ్చిందో ఆ ముగ్గురు స్నేహితురాళ్లకు.. ఒకేసారి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం ఉదయం జగిత్యాల శివారులోని చెరువులో విగత జీవులుగా తేలారు.. ఉప్పరిపేటకు చెందిన గంగాజల(19), మల్లిక(19), వందన(16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. అంతేకాదు వీరు ముగ్గురు దగ్గరి బంధవులు కూడా.. వీరిలో గంగాజల, మల్లికలకు ఈ ఏడాది ఆగస్టులో పెళ్లిళ్లు అయ్యాయి. వందన మాత్రం ఇంటర్ చదువుతోంది.. 

అయితే మల్లిక కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తండ్రి రాజం 10 రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు జరిపించారు. గంగాజల కూడా వారం రోజుల కింద పుట్టింటికి వచ్చింది. బుధవారం సాయంత్రం మల్లిక, గంగాజల, వందన షాపింగ్ కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల మొత్తం గాలించారు. అయినా వీరి ఆచూకి తెలియరాలేదు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. 

ఈక్రమంలో ధర్మసముద్రం చెరువులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. మల్లిక, గంగాజలలు విగత జీవులుగా ఉన్నారు. వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.. కానీ వందన మృతదేహం మాత్రం లభించలేదు.. మరో రెండు గంటల తర్వాత వందన మృతదేహం కూడా లభ్యమైంది. అయితే వీరి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకోబోతుంటే కాపాడేందుకు ప్రయత్నించి ముగ్గురు మృతి చెందారా అనే అనుమానస్పదంగా మారింది. అయితే మల్లిక, గంగాజల పెళ్లి అయిన రెండు నెలలకే చనిపోవడంతో వారి పుట్టింటితో పాటు అత్తరింట్లో విషాదం నెలకొంది. 

Leave a Comment