ఆర్థిక నేరగాడు కాబట్టే జగన్‌ను పిలవలేదు : చంద్రబాబు

చిత్తూరు: ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని.. వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి.. సమస్యలపై పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ మూర్ఖుడిగా, సైకో లాగా మారిపోయారన్నారు. తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు.

సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. మీడియాపైన కేసులు పెట్టిస్తున్న ఒకే ఒక వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శించారు. సోషల్ మీడియాతో  టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు.. త్వరలో నారా లోకేష్ కుప్పంలో పర్యటిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని కుప్పం నుంచే ప్రారంభిస్తామన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తల దాడులకు భయపడవద్దని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెడితే సంఘటితంగా పోరాటం చేద్దామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Leave a Comment