హైదరాబాద్ : కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ను క్యాట్ రద్దు చేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ అనుమతిచ్చింది. కృష్ణ కిశోర్పై ఉన్న కేసును రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణకిశోర్పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, అనిశా డీజీలకు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణ కిశోర్ ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది. కృష్ణ కిశోర్ నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని.. ఏపీ ఆర్థిక మండలి చట్టాన్ని ఉల్లంఘించారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని, విచారణ పూర్తయ్యే వరకు కృష్ణకిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కృష్ణ కిశోర్ క్యాట్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన క్యాట్ ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.