ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో దూషించడానికి సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్షులు లేకుండా, ఇంట్లోని నాలుగు గోడల మధ్య కులుం పేరుతో దూషించడం నేరం కాదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ అజయ్ రస్తోగిల ధర్మాసనం స్పష్టం చేసింది. బాధితుడు ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తి అయినప్పుడు మాత్రమే కులం పేరుతో జరిగే అన్ని రకాలైన అవమానాలు, దూషణలను ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరాలుగా భావిస్తామని తెలిపింది.
సమాజంలో అణగారిన వర్గానికి చెందిన వ్యక్తిని ఎవరైనా బహిరంగంగా అగౌరవపరచడం, అవమానించడం, వేధించడం వంటివి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నేరంగా చూడాలని సుప్రీం కోర్టు వెల్లడించింది. కాగా ఉత్తరాఖండ్ కు చెందిన హితేశ్ వర్మ తన ఇంట్లోకి వచ్చి కులం పేరుతో దూషించాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రాష్ట్ర హైకోర్టు అతడిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లాడు. సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసును కొట్టి వేసింది.