నేను ట్వీట్ పెడితే వైసీపీ వణుకుతోంది : నారా లోకేష్

ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. సీఎం జగన్ స్కామ్ ల కోసమే స్కీంలు తెచ్చారని ఆరోపించారు. వైసీపీ నేతలు పార్టీ గురించి మాట్లాడుతున్నారని, ఇంత దారుణమైన పాలన చూడలేదని అన్నారు. 

పాదయాత్రలో హామీలు తేలిగ్గా ఇచ్చిన జగన్ ఇప్పుడు మాత్రం షరతులు వర్తిస్తాయంటున్నారన్నారు. వైసీపీ ఏడాది పాలనలో 564మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రైతు భరోసా ప్రస్తుతం రైతు దగా కింద మారిందన్నారు. చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ పనిచేస్తున్నారన్నారు. అమ్మఒడి అర్ధఒడిగా మారిందన్నారు. ఇసుక దొరకడం లేదని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే మాట్లాడుతున్నరన్నారు. 

కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయన్నారు. వేలాదికోట్ల స్కామ్ విద్యుత్ లో జరుగుతోందన్నారు.  దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. కోవిడ్ ని కూడా క్యాష్ గా మార్చుకోవడం జగన్ ఘనత అన్నారు.  టెస్టింగ్ కిట్లలోనూ కక్కుర్తి పడ్డారని, బ్లీచింగ్ పౌడర్ పేరుతో రూ. 70 కోట్లు నొక్కేశారని, అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని విమర్శించారు.

Leave a Comment