రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి..!

ప్రస్తుతం ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న ఫొటోను తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు. అప్పటి నుంచి ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రోడ్డు పక్కన సామాన్యుడిలా కూరగాయలు అమ్మడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

తాజాగా ఈ వైరల్ ఫొటోపై ఐఏఎస్ అధికారి అఖిలేష్ మిశ్రా స్పందించారు. తాను కూరగాయల దుకాణం వద్ద కూర్చుంది నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మలేదని తెలిపారు. వృత్తిరీత్యా ప్రయాగ్ రాజ్ వెళ్లానని, అక్కడ మార్కెట్ లో ఆగి కూరగాయలు కొన్నానని వెల్లడించారు. అయితే కూరగాయలు అమ్మే ఓ వృద్ధురాలు కొద్దిసేపు ఆమె కూరగాయల షాప్ వద్ద కూర్చోవాలని అడిగిందన్నారు. ఆమె అడిగినదానికి కాదనలేక షాప్ వద్ద కాసేపు కూర్చున్నానని తెలిపారు. ఈలోగా కొందరు అక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారని, అది చూసిన తన స్నేహితుడు ఫొటో తీసి తన ఫోన్ ద్వారా ఫేస్ బుక్ లో పెట్టారని అఖిలేష్ మిశ్రా స్పష్టం చేశారు.   

Leave a Comment