రానున్న రోజుల్లో కరోనా ప్రభావం ఎలా ఉండబోతుంది?

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఎన్నో దేశాలు ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థికంగా చితికిపోయాయి. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు వేవ్ ల రూపంలో విళయతాండవం చేసిన కరోనా ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. 

ప్రస్తుతం మూడో వేవ్ కు స్వాగతం పలకడం తప్ప మనం ఏమీ చేయలేమని సైంటిస్టులు చెబుతున్నారు. నిస్తేజంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థను బాగు చేసుకోవడమే మనం చేయగలమని అంటున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందంటున్న అంశంపై స్పష్టత లేదని, సిరో సర్వేల డేటా సత్యమని చెప్పలేమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అయితే కరోనా మహమ్మారి ప్రభావం వచ్చే కొన్నేళ్లలో బాగా తగ్గిపోనుందని, సాధారణ జలుబు కలిగించే ఇతర కరోనా వైరస్ ల తరహాలో అది ఎప్పటికీ ప్రపంచంలో ఉండిపోనుందని నిపుణులు తెలుపుతున్నారు. ఆ స్థితిలో టీకా పొందని లేదా ఇప్పటివరకూ కరోనా ఇన్ఫెక్షన్ కు గురికాని పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అమెరికా-నార్వే పరిశోధకుల మోడలింగ్ లో తేలింది. 

చిన్నారుల్లో కోవిడ్ తీవ్రత ఒకింత తక్కువగా ఉండటం వల్ల కోవిడ్ కారక సార్స్-కోవ్-2 వైరస్ ప్రపంచ జనాభాలో ఎప్పటికీ ఉండేలా రూపాంతరం చెందినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండబోదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం మీద ఈ వైరస్ వల్ల సమాజంపై పడే భారం తగ్గుతుందని పేర్కొన్నారు. 

వయసు పెరిగేకొద్దీ కొవిడ్ తీవ్రత కూడా పెరుగుతుందని ఆ వ్యాధి తీరు తెన్నులను బట్టి స్పష్టమవుతోంది. అయితే పెద్దలు టీకాలు వేయించుకోవడం లేదా ఇప్పటికే ఒకసారి వైరస్ బారినపడటం వల్ల కరోనా ముప్పు క్రమంగా పిల్లలవైపు మళ్లుతుందని నార్వే శాస్త్రవేత్త ఒటార్ జోర్న్ స్డడ్ వెల్లడించారు. ఇతర కరోనా వైరస్ లు, ఇన్ ఫ్లూయెంజాల విషయంలోనూ ఇలానే జరిగిందని పేర్కొన్నారు. అవి కూడా తొలుత జోరును ప్రదర్శించి, ఆ తర్వాత ఎప్పటికీ ప్రజల్లో ఉండిపోయే వ్యాధిలా మారాయని స్పష్టం చేశారు. 

‘1889-1890లో వచ్చిన రష్యన్ ఫ్లూ వల్ల 10 లక్షల మంది చనిపోయారు. వారిలో ఎక్కువ మంది 70 ఏళ్లు పైబడినవాళ్లే. ఆ వ్యాధి కారక ‘హెచ్సీఓవీ-ఓసీ43’ వైరస్ ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇది స్వల్పస్థాయి జలుబు కలిగించే స్థాయికి తగ్గిపోయింది. అది కూడా ఎక్కువగా 7-12 నెలల చిన్నారులపై ప్రభావం చూపుతోంది.’ అని జోర్న్ స్డడ్ పేర్కొన్నారు. 

Leave a Comment