కరోనా వచ్చిందని 65 ఏళ్ల బామ్మను గెంటేశాడు..!

కరోనా కష్టకాలంలో కొందరు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేశాడు.. ఈ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. పట్టణ శివారులోని పద్మావతినగర్ లో బొజ్జ సామ్రాజ్యం అనే వృద్ధురాలు అద్దె ఇంట్లో నివసిస్తోంది. 

ఉన్న ఒక్కగానొక్క కొడుకు గతంలో ఇంటిని అమ్మేసి కన్న తల్లిని ఒంటరిగా వదిలేశాడు. ఇల్లు అమ్మిన డబ్బును కూడా తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్ డబ్బుతో జీవనం వెళ్లదీస్తోంది. 

అయితే బొజ్జ సామ్రాజ్యంకు కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న ఇంటి యజమాని సామన్లతో సహా బయటకు గెంటేశాడు.. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉంది. విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయం మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న ఎస్సై చినబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని హెచ్చరించి తిరిగి ఆమెను ఇంటిలోకి చేర్చారు. మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఇల్లు, పరిసరాలు శానిటేషన్ చేయించారు. ఆమెను స్థానిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు. 

Leave a Comment