హైదరాబాద్ పార్క్ లో హీరోయిన్ పై దాడి..!

హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో సినీ నటి షాలు చౌరాసియాపై దాడి జరిగింది. ఆమెను తీవ్రంగా గాయపరిచి సెల్ ఫోన్ తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నటి షాలు చౌరాసియా ఆదివారం సాయంత్ర 6.30 గంటలకు కేబీఆర్ పార్కకు వాకింగ్ కి వచ్చారు. వాకింగ్ చేస్తుండగా 8.45 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఆమెపై దాడి చేశాడు. కిందికి తోసేసి.. నోట్లో గుడ్డలు కుక్కి కొట్టాడు.  

దుండగుడి నుంచి తప్పించుకునేందుకు నటి చౌరాసియా తీవ్రంగా ప్రతిఘటించింది. అయినా విడిచిపెట్టలేదు. అరిస్తే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమె సెల్ ఫోన్ తీసి ఫోన్ చేసే క్రమంలో దాన్ని లాక్కొని పరారయ్యాడు. ఈ దాడిలో నటి కాళ్లు, చేతులు, ముఖంపైన గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం స్టార్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు, నగదు ఇవ్వాలని దుండగుడు అడిగాడని, మూడు సార్లు రాళ్లతో దాడి చేశారని చౌరాసియా ఫిర్యాదులో పేర్కొన్నారు. బండరాయితో మోది చంపేస్తానని బెదిరించాడని తెలిపారు.  

దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలా సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వీఐపీ జోన్ లోనే దారి దోపిడీ జరగడంపై నగర పీసీ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆభరణాలు, సెల్ ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా చౌరాసియా ఓ పిల్లా నీ వల్ల, అరణ్యంలో వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. 

Leave a Comment