ఆస్తి కోసం కన్నతల్లిపై అమానుషం..!

నవమాసాలు మోసి కని పెంచిన తల్లి పట్ల ఓ కొడుకు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురంలో చోటుచుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మానందపురంలో నాగమణి అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె భర్త వెంకటేశ్వరరావు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్లో వీరికి ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. ఆ స్థలంలో వీరు ఇంటిని నిర్మించుకున్నారు. 

వీరికి శేషు అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి ఉన్నప్పుడు శేషు భార్యతో కలిసి వేరే గ్రామంలో పని చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. తండ్రి చనిపోయాక భార్యతో కలిసి బ్రహ్మానందపురంలోని తల్లి ఇంటికి వచ్చాడు. దీంతో ఆ వృద్ధురాలు ఎంతో ఆనందపడింది. వృద్ధాప్యంలో తనకు తోడు ఉంటాడని భావించింది. అయితే ఆ తల్లి ఆనందం ఎన్నో రోజులు నిలవలేేదు. 

ఆస్తి కోసం తల్లిని నిత్యం వేధించేవాడు. ఆస్తిని తన పేరిట రాయాలని గొడవపడేవాడు. ఈక్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. శుక్రవారం మరోసారి తల్లితో గొడవడిన శేషు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చెంబుతో ఆమె తలపై కొట్టాడు. ఆమెను కాలితో తన్నాడు. దీనిని స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శేషును అదుపులోకి తీసుకున్నారు. తల్లిపై శేషు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Leave a Comment