ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆవుదూడను కాపాడబోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లా రాజా మొహల్లాలో జరిగింది. రాజా మొహల్లాలో ఓ పాడుబడ్డ బావి ఉంది. అందులో స్థానికులు చెత్త వేసేవారు. ఆ బావిలో ప్రమాదవశాత్తు ఆవు దూడ పడింది.
ఆవుదూడను కాపాడేందుకు ఓ వ్యక్తి నిచ్చెన సహాయంతో బావిలోకి దిగాడు. ఆ బావిలో వేసిన చెత్త వల్ల వచ్చే విషవాయులు వెలువడుతున్నాయి. విషవాయువును పీల్చి బావిలో దిగిన వ్యక్తి మూర్భపోయాడు. ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు మరో నలుగురు వ్యక్తులు బావిలో దిగారు. వారు కూడా ఆ విషవాయువుకు మూర్ఛపోయారు.
అగ్నిమాపక, మున్సపాలిటీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ ఐదుగురు మరణించినట్లు వైద్యలు నిర్ధారించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సహాయాన్ని ప్రకటించారు.