సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య..!

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లోని మధురానగర్‌లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  

శ్రావణి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు కొంతకాలం క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి టిక్‌ టాక్‌ ద్వారా శ్రావణికి పరిచయమయ్యాడు. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని శ్రావణికి మరింత దగ్గరయ్యాడు. గత కొద్ది నెలల నుంచి తనకు డబ్బులు ఇవ్వమని శ్రావణిని తరచూ వేధించేవాడు. శ్రావణిని ప్రేమించినట్లు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను బయపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేసేవాడు. 

శ్రావణికి వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వేధింపులు ఆగలేదు. అతని వేధింపులు భరించలేక శ్రావణి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రావణి మనసు మమత, మౌనరాగం సీరియల్స్ లో నటించింది. 

 

Leave a Comment