ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. బయోమెట్రిక్, ఐరిస్ హాజరు స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్ యాప్ విధానాన్ని తీసుకొచ్చింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆటోమెటిక్ గా ఉపాధ్యాయులకు సెలవుగా పడనుంది. ఉపాధ్యాయులు తమ సొంత స్మార్ట్ ఫోన్ల నుంచే ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యాశాఖ కొత్త ఆదేశాలతో ఉపాధ్యాయుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఉపాధ్యాయులు ‘సిమ్స్ ఏపీ’ అనే మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు కచ్చితంగా వారి హాజరు నమోదు చేయాలి. 9కి ఒక్క నిమిషం దాటినా సెలవుగా పరిగణించనున్నారు.
ఇప్పటి వరకూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అందరికీ ఒకే యాప్ ‘సిమ్స్-ఎపి’ని తీసుకొచ్చింది. విద్యార్థులకు కూడా అదే యాప్ నుంచి హాజరు వేయాలని స్పష్టం చేసింది. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యార్థుల పేర్లను యాప్లో నమోదు చేసుకుంటున్నారు. ఎవరి పాఠశాల ఆవరణలో వారికి హాజరును ముందుగా రికార్డు చేయాలి.
అయితే ఇటీవల విలీనమైన చోట్ల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లారు. రికార్డుల్లో మాత్రం పాత పాఠశాలనే చూపిస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ హాజరు నమోదు చేయాలనే దానిపై స్పష్టత లేదు. విద్యార్థుల హాజరుకు ఇప్పటి వరకూ 10:30 గంటల వరకు సమయం ఉండగా, ఇప్పుడు దానిని 10 గంటలకే కుదించారు.