కోవిడ్ కేసు వస్తే ఏ ఆస్పత్రికి కూడా వైద్యానికి నిరాకరించకూడదని, అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, పర్మిషన్ రద్దు చేస్తామన్న సీఎం జగన్ హెచ్చరించారు. ఆమేరకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. కోవిడ్–19 నివారణ చర్యలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్ల మీద ఫోకస్ పెంచాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్ సెంటర్ నంబర్ తో కూడిన హోర్డింగ్ ఏర్పాటు చేాయాలన్నారు.
సేవల్లో నాణ్యత ఉండాలి..
సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యమని, కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లలో నాణ్యతపై దృష్టిపెట్టని అధికారులకు నోటీసులు జారీచేయాలని సీఎం వెల్లడించారు. మనం దీర్ఘకాలం కోవిడ్తో పోరాడాల్సిన అవసరం ఉందని, చేసే పనుల్లో నాణ్యత లేకపోతే మనం ఫలితాలు సాధించలేమని సీఎం స్పష్టం చేశారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మరిన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.
కోవిడ్ పరీక్షలు చేయించుకోవడానికి శాశ్వత కేంద్రాలు ఉండాలని సీఎం జగన్ తెలిపారు. అదే విధంగా టెస్టులు ఒక ఎస్ఓపీ ప్రకారం చేయాలన్నారు. ఎవరికి చేయాలి అన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్ ఉండాలని నిర్దేశం చేశారు.టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలన్నారు.
కంటైన్మెంట్ ప్రాంతాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అలాగే హైరిస్క్ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నామన్నారు. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా సరే.. ఎక్స్రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్గా పరిగణిస్తూ వైద్యం అందిస్తున్నామన్నారు. పాజిటివ్గా తేలిన వారు ఆలస్యంగా ఆస్పత్రికి వస్తుండడంతో మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అధికారులు వివరించారు.